Monday 1 October 2012

Sivanandalahari-23

కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి |
పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతా
మదృష్ట్వా తత్ ఖేదం కథమిహ సహే శంకర విభో || (23)

కరోమి = చేసెదను
త్వత్ పూజాం = నీ పూజ
సపది = తక్షణమే
సుఖదో మే భవ = నాకు సుఖములను ప్రసాదించుము
విభో = ఓ విభో, సర్వవ్యాపీ
విధిత్వం = బ్రహ్మ పదవి
విష్ణుత్వం = విష్ణు పదవి
దిశసి ఖలు = నీవు ప్రసాదించివేస్తే
తస్యాః ఫలం ఇతి = (నా పూజకు) ఫలముగా
పునః చ  = అప్పుడు మరలా
త్వాం ద్రష్టుం = నిన్ను దర్శించడానికి
దివి భువి వహన్ = ఆకాశము మరియు భూములయందు సంచరించి
పక్షి మృగతాం = పక్షిగాను మరియు మృగముగాను
అదృష్ట్వా = దర్శించలేక
తత్ ఖేదం = ఆ ధుఃఖమును
కథం ఇహ సహే = ఎలా ఇక్కడ భరించగలను
శంకర = ఓ శంకరా, ఆనంద ప్రదాయకా
విభో = ఓ విభో, సర్వవ్యాపీ

నీ పూజ చేసెదను. ఓ విభో, నాకు తక్షణమే సుఖములను ప్రసాదించుము. పూజకు ఫలముగా నీవు బ్రహ్మ పదవో లేక విష్ణు పదవో ప్రసాదించివేస్తే, అప్పుడు నిన్ను మరలా దర్శించడానికి ఆకాశము మరియు భూములయందు పక్షిగానో లేక మృగముగానో సంచరించవలసి వస్తుంది. నిన్ను దర్శించలేక, ఓ శంకరా, ఆ ధుఃఖమును ఎలా ఇక్కడ భరించగలను విభో.


కొన్ని వివరణలు:

(1) పురాణ గాధ ప్రకారము: ఒకసారి బ్రహ్మ విష్ణువుల నడుమ తమలో ఎవరు గొప్ప అని సంవాదం జరిగింది. ఈ విషయం తేల్చుకోవడానికి వారిద్దరూ పరమశివుని వద్దకు వెళ్ళారు. అప్పుడు పరమశివుడు అగ్నిస్తంభ రూపములో వారి మధ్యన ఆవిర్భవించి, "మీ ఇరువురిలో ఎవరు నా ఆద్యంతాలను ముందుగా దర్శించి చెబుతారో వారే గొప్పవారు" అని చెప్పాడు. ఈ మాటలు విన్న బ్రహ్మ హంస రూపంతోను, విష్ణువు వరాహ రూపంతోను సిద్ధమయ్యారు. హంస రూపియైన బ్రహ్మ శిరోభాగాన్ని వెతుకుతూ నింగిపైకి వెళ్లగా, వరాహ రూపియైన విష్ణువు పాదభాగాన్ని అన్వేషిస్తూ భూమిలోకి వెళ్లసాగాడు. అలా వేల సంవత్సరాలపాటు వెదికినప్పటికీ వారు పరమేశ్వరునియొక్క ఆద్యంతాలను దర్శించలేకపోయినట్లు ఐతిహ్యము. శ్రీ శంకరాచార్యులవారు ఈ గాధను అడ్డంపెట్టుకుని, చక్కటి "హస్య రసము" మరియు "భక్తుని హృదయంలో భగవంతుని ఎడల గల విరహ భావన" ల సమ్మేళనముతో ఈ చమత్కారమైన శ్లోకాన్ని ఆవిష్కరించారు.

No comments:

Post a Comment