Saturday 1 November 2014

Sivanandalahari-49




ఆనన్దామృత పూరితా హరపదాంభోజాలవాలోద్యతా
స్థైర్యోపఘ్నముపేత్య భక్తి లతికా శాఖోపశాఖాన్వితా
ఉచ్ఛైర్మానస కాయమాన పటలీమాక్రమ్య నిష్కల్మషా
నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా (49)


ఆనన్ద అమృత = ఆనందము అనెడి అమృతముతో
పూరితా = నింపబడి
హర పదాంభోజ = శివుని పాదపద్మములు అనెడి
ఆలవాల ఉద్యతా = పందిరి రాటపై (ప్రాకుడు కర్రపై) ఎగబ్రాకి
స్థైర్య ఉపఘ్నం ఉపేత్య = స్థైర్యము (అనెడి పందిరిపై గల కర్రల)ను ఆధారముగా చేసుకుని
భక్తి లతికా = భక్తి అనెడి లత
శాఖ ఉపశాఖ అన్వితా = చిలవలు పలవలను అల్లుకొనుచు
ఉచ్ఛైః మానస = ఉన్నతమైన మనస్సు అను
కాయమాన పటలీం = పందిళ్ళ సమూహమును
ఆక్రమ్య = ఆవరించుకొని
నిష్కల్మషా = (చీడ మొదలగు వానిచే) శిధిలముగాక
నిత్య అభీష్ట ఫల ప్రదా = శాశ్వతమైన కోర్కెను తీర్చున్నది (మోక్షము అను ఫలమును ఇచ్చునది)
భవతు మే = నాకు అగుగాక
సత్కర్మ సంవర్ధితా = పుణ్య కర్మలచే వృద్ధి పొందుచు

భక్తి అనెడి లత - ఆనందము అనెడి అమృతమయ జలములతో పోషింపబడిశివుని పాదపద్మములు అనెడి పందిరి రాటపైనుండి ఎగబ్రాకి,  స్థైర్యము అనెడి పందిరిపై గల కర్రలను ఆధారముగా చేసుకుని, చిలవలు పలవలను అల్లుకొనుచు, ఉన్నతమైన మనస్సు అను పందిళ్ళ సమూహమును ఆవరించుకొని, చీడ మొదలగు వానిచే శిధిలముగాక, పుణ్య కర్మలచే వృద్ధి పొందుచు, నా మనోభీష్టమగు శాశ్వతమైన మోక్షము అను ఫలమును ఇచ్చుగాక.

కొన్ని వివరణలు:

(1) ఈ శ్లోకమునందు "శివునిపై గల భక్తి వృద్ధి చెంది మోక్ష ఫలమును ఇచ్చుట" - "లత పెరిగి ఫలములనిచ్చుట" తో పోల్చబడినది. పాదునుండి బయలుదేరిన లత, నీటితో పోషింపడి, పందిరియొక్క రాటలను ఆధారంగా చేసుకుని పందిరిపైకి ఎగబ్రాకి, శాఖోపశాఖలుగా విస్తరించి, చీడ పీడల వలన శిధిలమవకుండా, వృద్ధిని పొందినప్పుడు, ఆ లత మధురమైన ఫలములను ఇస్తుంది; అదేవిధంగా "శివభక్తి" అనే లత, మనము ఏమి ఆచరిస్తే, "మోక్షము" అనే శాశ్వత ఫలాని మనకు ప్రసాదిస్తుందో ఈ శ్లోకంలో శ్రీ శంకరాచార్యులవారు వర్ణించారు.

Saturday 25 October 2014

Sivanandalahari-48

నిత్యానన్ద రసాలయం సురముని స్వాన్తామ్బు జాతాశ్రయం
స్వచ్ఛం సద్విజ సేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతమ్ .
శంభుధ్యాన సరోవరం వ్రజ మనో హంసావతంస స్థిరం
కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి (48)

నిత్య ఆనన్ద = శాశ్వతమైన ఆనందము
రస = (అనెడి) ఉదకమునకు (నీటికి)
ఆలయం = స్థానమైనది
సుర = దేవతలయొక్కయు
ముని = మునులయొక్కయు
స్వాన్త = హృదయములు అను
అమ్బుజాత = పద్మములకు
ఆశ్రయం = ఆశ్రయమైనది
స్వచ్ఛం = నిర్మలమైనది
సద్విజ = బ్రహ్మజ్ఞానమునకై తపించువారిచే
సేవితం = సేవింపబడునది
కలుష హృత్ = కల్మషములను హరించునది
సద్వాసనా = శుభ వాసనలను (సంస్కారములను)
ఆవిష్కృతమ్ = కలుగజేయునది(అయిన)
శంభు ధ్యాన = ఈశ్వరునియొక్క ధ్యానము (అనెడి)
సరోవరం = సరోవరమును
వ్రజ = పొందుము
మన హంస అవతంస = ఓ (నా) మనస్సు అనెడి హంసరాజమా
స్థిరం = స్థిరముగా.
కిం = ఎందులకు
క్షుద్రాశ్రయ = అల్పములైనవాటిని ఆశ్రయించి
పల్వల భ్రమణ = బురద గుంటలయందు తిరుగుటచే
సంజాత శ్రమం ప్రాప్స్యసి = జనించెడి శ్రమను పొందెదవు?

మనస్సు అనెడి ఓ హంసరాజమా! నీవు సుస్థిరమైన "ఈశ్వర ధ్యానము" అనెడి సరోవరమును పొందుము. "ఈశ్వర ధ్యానము" అను ఆ సరస్సు శాశ్వతమైన ఆనందమును నీరుగా కలిగియున్నది. దేవతలు మరియు మునుల యొక్క హృదయములు అనెడి పద్మములకు ఆశ్రయమైయున్నది. నిర్మలమైనది, బ్రహ్మజ్ఞానమునకై తపించుచున్నవారి దాహార్తిని తీర్చునది, మనలోని కలుషములను హరించునది, మంచి సంస్కారములను మనయందు ఆవిష్కరించునది అగు ఆ సరోవరమును స్థిరముగా పొందుము. ఓ మనసా! నీవు అట్టి సరస్సును పొందక, ఎందులకు అల్పములైన బురదగుంటలను ఆశ్రయించి అనవసర శ్రమను పడుచున్నావు?

కొన్ని వివరణలు:

(1) ఈ శ్లోకములో ఈశ్వర-ధ్యానము సరోవరముతో పోల్చబడినది. ఆ సరోవరములో ఏది నీరుగా యున్నదో, అందలి పద్మములు ఏమిటో, ఆ నీటిని ఎవరు త్రాగుచున్నారో, ఆ నీటి తత్వమేమిటో, ఆ నీరు త్రాగడంవలన ఏమి జరుగుతుందో ఈ శ్లోకంలో శ్రీ శంకరాచార్యులవారు బోధించారు.

(2) పైన తెలిపిన పోలికల సహాయంతో - ఈశ్వర-ధ్యానాన్ని అసలు సరోవరంతో ఎందుకు పోల్చారో అని అలోచిస్తే, అప్పుడు, ఈ శ్లోకంలో "బురద గుంటలను ఆశ్రయించి శ్రమపడుట" అని దేనిని గురించి చెబుతున్నారో మనకు అర్ధమువుతుంది!

Saturday 18 October 2014

Sivanandalahari-47

శంభుధ్యాన వసన్త సంగిని హృదారామేఽఘజీర్ణచ్ఛదాః
స్రస్తా భక్తి లతాచ్ఛటా విలసితాః పుణ్యప్రవాల శ్రితాః .
దీప్యన్తే గుణకోరకా జపవచః పుష్పాణి సద్వాసనా
జ్ఞానానన్ద సుధామరన్ద లహరీ సంవిత్ ఫలాభ్యున్నతిః (47)


శంభు ధ్యాన = ఈశ్వర ధ్యానము (అనెడి)
వసన్త = వసంత ఋతువుతో
సంగిని = సంబంధము (సంగము) కలిగిన
హృద్ ఆరామే = హృదయము అనెడి ఉద్యానవనములో
అఘ జీర్ణ ఛదాః = పాపములు అనెడి పండుటాకులు
స్రస్తాః = రాలిపోవును
భక్తి లతా ఛటా = భక్తి అనెడి తీగల సమూహములు
విలసితాః = ఉదయించును
పుణ్య = (ఆ తీగలు) పుణ్యము అనెడి
ప్రవాల శ్రితాః = చిగురుటాకులను పొందును
దీప్యన్తే = ప్రకాశించును
గుణ కోరకాః = సద్గుణములు అనెడి మొగ్గలతో
జప వచః = జప-వచనములు అనెడి
పుష్పాణి = పూవులు
సత్ వాసనా = సద్గుణములు అనెడి సువాసనలతో
జ్ఞాన ఆనన్ద సుధా = జ్ఞానమువలన కలిగిన ఆనందము అనెడి అమృతము
మరన్ద లహరీ = (అనెడి) పుష్పరసములయొక్క తరంగములు
సంవిత్ ఫల అభ్యున్నతిః = బ్రహ్మజ్ఞానము అనెడి ఫలము వృద్ధిని పొందును

హృదయము అనెడి ఉద్యానవనము ఈశ్వర ధ్యానము అనెడి వసంత ఋతువుతో సంబంధమును పొందినపుడు - పాపములు అనెడు పండుటాకులు రాలిపోవును. భక్తి అనెడి తీగల సమూహములు వ్యాపించును. ఆ తీగలు పుణ్యము అనెడి చిగురుటాకులను పొందును. సద్గుణములు అనెడి మొగ్గలతో ప్రకాశించును. జప-వచనములు (స్థుతులు) అనెడి పూవులు పూయును. సద్గుణములు అనెడి సువాసనలతో నిండిపోవును. జ్ఞానానందము అనెడి అమృతమయ ఫలరసముల తరంగములు ఆ వనమంతా వ్యాపించును. ఆ తీగలకు కాసిన బ్రహ్మజ్ఞానము అనెడి ఫలము దినదినాభివృద్ధిని పొందును.


కొన్ని వివరణలు:

(1) వసంతకాలం వచ్చినప్పుడు - ఉద్యానవనములలోని చెట్లకు ఉన్న ఎండుటాకులన్నీ రాలిపోతాయి; కొత్త కొత్త తీగలు వస్తాయి; వాటికి కొత్త ఆకులు చిగురిస్తాయి; మొగ్గలు తొడుగుతాయి; పుష్పాలు వికసిస్తాయి; వనమంతా సువాసనలతో నిండిపోతుంది; పూవులన్నీ తేనెలతో నిండియుంటాయి. ఫలములన్నీ దినదినాభివృధ్ధిని పొందుతాయి. ఆలానే, మనస్సు అనే వనములోనికి, ఈశ్వర ధ్యానము అనే వసంతము ప్రవేశిస్తే ఏమి జరుగుతుందో ఈ పై శ్లోకములో శ్రీ శంకరాచార్యులవారు ఎంతో మధురంగా వర్ణించారు.

Monday 6 October 2014

Sivanandalahari-46

ఆకీర్ణే నఖరాజికాన్తి విభవైరుద్యత్సుధా వైభవై
రాధౌతేపి చ పద్మరాగ లలితే హంసవ్రజైరాశ్రితే .
నిత్యం భక్తి వధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు
స్థిత్వా మానస రాజహంస గిరిజానాథాంఘ్రి సౌధాన్తరే (46)


ఆకీర్ణే = వ్యాపించిన
నఖ రాజి = (కాలి) గోటి వరుసలయొక్క
కాన్తి విభవైః = కాంతుల అతిశయము,
ఉద్యత్ = పెల్లుబుకుచున్న
సుధా వైభవైః = చంద్రునియొక్క అమృత కిరణములచే
ఆధౌతే = శుభ్రపడినదియు,
అపిచ = మరియు
పద్మరాగ లలితే =  పద్మములయొక్క ఎరుపువంటి రంగుతో ఒప్పారుచున్నది,
హంస వ్రజైః = పరమహంసల సమూహములచేత
ఆశ్రితే = ఆశ్రయింపబడినది,
నిత్యం = ఎల్లప్పుడును
భక్తి వధూ గణైః చ = భక్తి అనెడి భార్యలతో కూడి
రహసి = రహస్యముగా
స్వేచ్ఛా విహారం కురు = స్వేచ్ఛగా విహారము చేయుము
స్థిత్వా = నివసించి
మానస రాజహంస = ఓ మనస్సు అనెడి రాజహంసా!
గిరిజా నాథాంఘ్రి = గిరిజానాథుని పాదపద్మములనెడి
సౌధాన్తరే = సౌధము (భవనము) లో

గిరిజానాథుని పాదపద్మములనెడి సౌధము - ఈశ్వరుని కాలి గోటి వరుసలయొక్క కాంతుల అతిశయముతో వ్యాపించియున్నది; శివుని శిరస్సున ఉన్న చంద్రునినుండి స్రవించుచున్న అమృతమయ కిరణములతో ప్రకాశించున్నది; ఈశ్వరుని పాదములనుండి వెలువడుచున్న 'పద్మములయొక్క ఎరుపును పోలిన' రంగుతో ఒప్పారుచున్నది; మహాయోగులైన పరమహంసల సమూహములచేత ఆశ్రయింపబడుచున్నది. అట్టి ఆ సౌధాంతరాళమునందు, ఓ మనస్సు అనెడి రాజహంసా!, నీవు ఎల్లప్పుడును భక్తి అనెడి భార్యలతో కూడి, అచట నివసించుచు, రహస్యముగా, స్వేచ్ఛగా విహారము చేయుము.


Tuesday 22 July 2014

Sivanandalahari-45

ఛన్దశాఖి శిఖాన్వితైః ద్విజవరైస్సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే .
చేతః పక్షిశిఖామణే త్యజ వృథా సంచారమన్యైరలం
నిత్యం శంకర పాదపద్మ యుగలీ నీడే విహారం కురు (45)

ఛన్ద శాఖి = వేదములు కొమ్మలుగాను
శిఖా అన్వితైః = (ఉపనిషత్తులు) ఆ కొమ్మల చివరలుగా కలిగినది
ద్విజవరైః = బ్రాహ్మణ శ్రేష్ఠులచే (లేదా పక్షి శ్రేష్ఠములచేతను)
సంసేవితే = విశేషముగా సేవింపబడునది
శాశ్వతే = శాశ్వతమైనది
సౌఖ్య ఆపాదిని = సౌఖ్యమును కలిగించునది
ఖేద భేదిని = దుఃఖ నాశనము చేయునది
సుధా సారైః ఫలైః = అమృతమే రసముగా కలిగిన ఫలములతో
దీపితే = ప్రకాశించుచున్నది
చేతః పక్షి శిఖా మణే = ఓ మనస్సు అనెడి పక్షి రాజమా
త్యజ వృథా సంచారం = అనవసరమైన సంచారమును విడువుము
అన్యైః అలం = ఇతరములు ఇక చాలును
నిత్యం = ఎల్లప్పుడూ
శంకర పాదపద్మ యుగలీ నీడే = శంకరుని పాదపద్మద్వంద్వము అను గూటియందు
విహారం కురు = విహరించుము

మనస్సు అనెడి ఓ పక్షిరాజమా! వృధా సంచారములను విడిచిపెట్టుము. ఆ తిరుగుళ్ళు ఇక చాలును. శంకరుని పాదపద్మములనెడి గూటియందు, వేదములు ఆ వృక్షముయొక్క కొమ్మలుగాను, ఉపనిషత్తులు కొమ్మల చివరలుగాను కలిగియుండి, బ్రాహ్మణ శ్రేష్ఠులచే విశేషముగా సేవింపబడుచున్నది, శాశ్వతమైనది, సౌఖ్యమును కలిగించునది, దుఃఖమును నశింపజేయునది, అమృతమే రసముగా కలిగిన ఫలములతో ప్రకాశించునది అగు ఆ వృక్షముపై హాయిగా విహరించుము.


కొన్ని వివరణలు:

(1) పక్షి అన్ని చోట్లకు ఎలా తిరుగుతుందో, మనస్సుకూడా అలానే అన్ని చోట్లకు తిరిగివస్తూ ఉంటుంది. అందువలన, ఈ శ్లోకమునందు మన మనస్సు బాగా తిరుగుబోతు అయిన పక్షితో పోల్చబడినది.

(2) పై శ్లోకములో "ద్విజ" అనగా "రెండు జన్మలు కలిగినది" అని అర్ధము. ఈ పదము, పక్షికిని మరియు బ్రాహ్మణునకుకూడా అన్వయమగును. పక్షి, మొదట గ్రుడ్డుగా ఉండి, ఆ తరువాత పిల్లగా దానినుండి బయటకు వచ్చును; కావున అది రెండు జన్మలు కలిగినదిగా భావింపబడును. అలానే, బ్రాహ్మణుడు (= బ్రహ్మ జ్ఞానమును పొందుటకై యత్నించువాడు) ఉపనయన సంస్కారముతో రెండవ జన్మ పొందినవాడిగా పరిగణింపబడును.

Sunday 20 July 2014

Sivanandalahari-44



కరలగ్నమృగః కరీన్ద్ర భంగో
ఘనశార్దూల విఖణ్డనోఽస్త జన్తుః .
గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే
పంచముఖోస్తి మే కుతో భీః (44)

కర లగ్న మృగః = లేడిని (మాయను) చేజిక్కించుకున్నవాడు
కరీన్ద్ర భంగః = గజాసురునికి భంగపాటును (ఓటమిని) కలిగించినవాడు
ఘన శార్దూల విఖణ్డనః = ప్రబలుడైన వ్యాఘ్రాసురుని ఖండిచినవాడు
అస్త జన్తుః = ప్రాణకోటినంతటిని తనయందు లయము చేసుకొనువాడు
గిరిశః = కొండగుహయందు (హృదయమునందు) శయనించువాడు
విశద ఆకృతిః చ = మరియు తేజోస్వరూపము కలవాడు (అయిన పరమేశ్వరుడు)
చేతః కుహరే = నా మనస్సు అనెడి గుహయందు
పంచ ముఖః అస్తి = ఐదు ముఖములవాడు (శివుడు) ఉండగా
మే కతో భీః = నా దరికి భయము ఎక్కడనుండి రాగలదు?

లేడిని తన చేజింక్కించుకున్నవాడు, గజాసురునికి భంగపాటును కలిగించినవాడు, ప్రబలుడైన వ్యాఘ్రాసురుని ఖండించినవాడు, ప్రాణికోటినంతటినీ తనయందు లయము చేసుకొనువాడు, హృదయ కుహరమునందు శయనించువాడు, మరియు మహా తేజోస్వరూపుడు అయిన ఆ పంచముఖుడు (ఈశ్వరుడు), నా మనస్సు అనెడి గుహయందు ఉండగా ఇక నా దరికి భయము అనునది ఎక్కడనుండి రాగలదు?


కొన్ని వివరణలు:

(1) "హృదయమనెడి గుహయందు" నివసించు ఈశ్వరునిగూర్చి వర్ణించుటకు ప్రయోగించిన విశేషణములు, "అరణ్య గుహలలో" నివసించు సింహమునకుకూడా వర్తించేటట్లు, ఈ శ్లోకములో చాలా చమత్కారమైన రచన చేసారు శ్రీ శంకరాచార్యులవారు. అరణ్యమునకు సింహము ఎలానో, సకల భువనములకు శివుడు అలానే కాబట్టి, రెండింటికీ వర్తించేటట్లుగా విశేషణములను వాడడం ఎంతగానో తగియున్నది!

సింహమునకు ఆ విశేషణములు ఎలా వర్తిస్తాయో ఇప్పుడు చూద్దాము:

కర లగ్న మృగః = మృగములను తన పంజాయందు చిక్కించుకొనునది
కరీన్ద్ర భంగః = ఏనుగును చంపునది
ఘన శార్దూల విఖణ్డనః = బలమైన పులినికూడా దునుమాడునది
అస్త జన్తుః = తనను చూచినంతనే జంతువులన్నియు పారిపోయి మాయమగునట్లు చేయునది
గిరిశః = కొండ గుహలయందు నివసించునది
విశద ఆకృతిః చ = మరియు ప్రచండమైన ఆకృతి కలది
పంచ ముఖః అస్తి = బాగుగా తెరువబడిన నోరుకలది

(2) శివుడు పంచముఖుడు - ఆయన ఐదు ముఖములు (లేదా మూర్తుల) పేర్లు - (i) సద్యోజాత, (ii) వామదేవ, (iii) అఘోర, (iv) తత్పురుష మరియు (v) ఈశాన. తాత్వికముగా, ఈశ్వరుని ఐదు ముఖములు ఆయన నిర్వర్తించు (i) సృష్టి, (ii) స్థితి, (iii) లయము, (iv) తిరోధానము (అనగా దుష్టత్వమును నిగ్రహించుట), మరియు (v) అనుగ్రహములకు సంకేతములు.

Monday 14 July 2014

Sivanandalahari-43

మా గచ్ఛ త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు
స్వామిన్నాదికిరాత మామకమనః కాన్తార సీమాన్తరే .
వర్తన్తే బహుశో మృగా మదజుషో మాత్సర్య మోహాదయ
స్తాన్ హత్వా మృగయా వినోద రుచితా లాభం చ సంప్రాప్స్యసి (43)

మా గచ్ఛ త్వం = నీవు వెళ్ళవద్దు
ఇతః తతః = అటు-ఇటు
గిరిశ భో = ఓ కైలాసవాసా
మయి ఏవ = నాయందే
వాసం కురు = నివాసము ఉండుము
స్వామిన్ = ఓ స్వామీ
ఆది కిరాత = ఓ ఆది కిరాతమూర్తీ (మొట్టమొదటి బోయవాడా!)
మామక మనః = నా మనస్సు (అనెడి)
కాన్తార సీమాన్తరే = అరణ్యము లోపల
వర్తన్తే = తిరుగుచున్నవి
బహుశో మృగాః = అనేక మృగములు
మదజుషః = మదించిన
మాత్సర్య మోహాదయః = మాత్సర్యము (అసూయ), మోహము మొదలగునవి
తాన్ హత్వా = వాటిని సంహరించి
మృగయా వినోద రుచితా = వేటడుట అనెడి వినోదములోగల రుచిని (మజా!)
లాభం చ సంప్రాప్స్యసి = ఆనందమును పొందగలవు

ఓ కైలాశవాసా, నీవు అటు ఇటు వెళ్ళక, కేవలము నాలోనే నివసించుము. ఓ ఆది కిరాతమూర్తి! నా మనస్సు అనెడి ఘోరారణ్యములోపల మోహము, మాత్సర్యము ఇత్యాది క్రూర మృగములు అనేకములు మదించి తిరుగుచున్నవి. వాటిని నీవు వేటాడి, వేటయందు నీకుగల కోర్కెను తీర్చుకుని ఆనందమును పొందుము!

కొన్ని వివరణలు:

ఈ శ్లోకమునందు, శ్రీ శంకరాచార్యులవారు, పరమశివుని "ఓ ఆది కిరాతమూర్తీ!" అని సందర్భోచితముగా సంభోదించారు. మనస్సులోని మోహము, మాత్సర్యము ఇత్యాది క్రూరమృగములను వేటాడుమని కోరునపుడు, ఈశ్వరునికి తనయొక్క కిరాత (బోయవాని) స్వరూపమును గుర్తుచేస్తున్నారు. అయితే ఈశ్వరుడు బోయవాని రూపమును ధరించినట్లు ఎక్కడ చెప్పబడినది?

(i) రుద్రాధ్యాయము నాలుగవ అనువాకమునందు, "నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చవో నమో" - అనగా - "మృగములను చంపే వేటగాడివైన మీకు నమస్కారము, కుక్కల మెడలయందు కట్టబడిన తాళ్ళను చేతితో పట్టుకునియున్న మీకు నమస్కారము" అని రుద్రునియొక్క కిరాత-రూపము వర్ణించబడినది.
http://namakam-telugu.blogspot.com/2012/05/anuvakam-4.html

(ii) ఆర్జునుడు పాశుపతాస్త్రమును పొందుటకై పరమేశ్వరునిగూర్చి తపస్సు చేయగా, ఈశ్వరుడు బోయవాని రూపములో వచ్చి, అర్జునుని పరీక్షించి, పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు (భారవి విరచిత కిరాతార్జునీయం).

(iii) ఈ శ్లోకములో వివరించినట్లు, ఈశ్వరుడు అనాదిగా భక్తుల హృదయములయందలి దుష్ట సంస్కారములనే క్రూర మృగములను వేటాడి సంహరించుచున్నాడు కావున, అయనను "ఆది కిరాతకమూర్తీ" అని పిలుచుకొనడము సహజమే కదా!

Wednesday 9 July 2014

Sivanandalahari-42

గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ
స్తోమశ్చాప్తబలం ఘనేన్ద్రియచయో ద్వారాణి దేహే స్థితః
విద్యా వస్తు సమృధ్దిరిత్యఖిల సామగ్రీ సమేతే సదా
దుర్గాతిప్రియ దేవ మామక మనో దుర్గే నివాసం కురు (42)

గాంభీర్యం = గంబీరమైన భావము
పరిఖాపదం = కందకము (అగడ్త) గాను
ఘనధృతిః = విశేషమైన ధైర్యము
ప్రాకార = (కోటయొక్క) ప్రాకారములుగాను
ఉద్యద్గుణ స్తోమః చ = మరియు వికసించుచున్న సద్గుణముల సమూహము
ఆప్త బలం = నమ్మకమైన బలముగాను
ఘన ఇన్ద్రియ చయః = కన్ను ఇత్యాది ఇంద్రియములు
ద్వారాణి = (కోటయొక్క) ద్వారములుగాను
దేహే స్థితః = దేహమున ఉన్నట్టి
విద్యా = ఈశ్వరుని గురించిన జ్ఞానము
వస్తు సమృధ్ది = పదార్ధ సంపత్తిగను
ఇతి = ఈవిధముగా
అఖిల సామగ్రీ సమేతే = సకల వస్తువులతో సమగ్రముగానున్న
సదా = ఎల్లప్పుడు
దుర్గాతి ప్రియ దేవ = దుర్గములయందు (లేదా దుర్గాదేవియందు) మిగుల ప్రీతి కలిగిన ఓ దేవా
మామక మన దుర్గే = నా మనస్సు అనెడి దుర్గమందు
నివాసం కురు = (దయతో) నీవు నివశించుము

ఓ దుర్గాతిప్రియ దేవా! నా మనస్సు దుర్గమమైన కోటయొక్క లక్షణములన్నింటినీ కలిగియున్నది. గాంబీర్యమే కందకముగాను, విశేషమైన ధైర్యము ప్రాకారములుగాను, మరియు వికసించుచున్న సద్గుణాల రాసియే విశ్వసనీయమైన సైన్యముగాను, కన్నులు ఇత్యాది ఇంద్రియములు ద్వారములుగాను, ఈశ్వర జ్ఞానమే పదార్ధ సంపదగను, ఈవిధముగా సకల వస్తువులతో సమగ్రముగాయున్నట్టి నా మనస్సు అనెడి కోటయందు నీవు దయతో సదా నివశించుము. 

కొన్ని వివరణలు: 
(1) "దుర్గాతి ప్రియ దేవ" అనుదానికి బహు అర్ధములు కలవు;
  (a) "దుర్గాదేవియందు అత్యంత ప్రీతి కలిగిన ఓ దేవా" అని ఒక అర్ధము.
  (b) "దుర్గాదేవికి అత్యంత ప్రియుడవైన ఓ దేవా" అని ఇంకొక అర్ధము. 
  (c) "పరులకు ప్రవేశించ శక్యముకాని (దుర్గమ) ప్రదేశములలో (కోటలలో) నివశించుటయందు అత్యంత ప్రీతికలిగిన ఓ దేవా" - అనగా - "భక్తులయొక్క హృదయములనెడి కోటలలో నివశించుటయందు అత్యంత ప్రీతినిజూపు ఓ దేవా" అని అర్ధము.

Thursday 3 July 2014

Sivanandalahari-41

 పాపోత్పాత విమోచనాయరుచిరైశ్వర్యాయ మృత్యుంజయ
స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే
జిహ్వా చిత్త శిరోఙ్ఘ్రి హస్త నయన శ్రోత్రైరహం ప్రార్థితో
మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మా మేవచః (41)

పాప ఉత్పాత = పాపములవలన సంభవించు విపత్తులనుండి
విమోచనాయ = విమోచనము పొందుటకు
రుచిః ఐశ్వర్యాయ = విశేషమైన ఐశ్వర్యములను పొందుటకు
మృత్యుంజయ = ఓ మృత్యుంజయా!
స్తోత్ర = (నీ) స్తుతులను
ధ్యాన = (నీ) ధ్యానమును
నతి = (నీకు) ప్రణమిల్లుట
ప్రదక్షిణ = ప్రదక్షిణలను
సపర్యా = (నీ) సేవను
ఆలోకన = (నీ రూపమును) వీక్షించుట
ఆకర్ణనే = (నీ లీలా) శ్రవణము (అనెడి కార్యములను)
జిహ్వా = (నా) జిహ్వతోను
చిత్త = మనస్సుతోను
శిర = శిరస్సుతోను
అంఘ్రి = పాదములతోను
హస్త = కరములతోను
నయన = నయనములతోను
శ్రోత్రైః = చెవులతోను (ఆచరించునట్లు)
అహం = నేను
ప్రార్థితః = ప్రార్ధింపబడినవాడినైతిని
మాం = నన్ను
ఆజ్ఞాపయ = (అట్లు చేయమని) ఆజ్ఞాపింపుము
తత్ = స్తుతించుట మొదలగువానిని ఆచరించుటకు
నిరూపయ = తగు ప్రేరణ కలిగించుము
ముహుః = మాటిమాటికిని
మామ్ = నాయెడల
ఏవ మా మే అవచః = ఈ విధముగా మౌనమును వహించకుము

ఓ మృత్యుంజయా! పాపముయొక్క ఉత్పాతములనుండి విమోచనమును పొందుటకును, మరియు మహదైశ్వర్య ప్రాప్తి కొరకును, నిన్ను స్తుతింపుమని నా నాలుకయు, నిన్ను ధ్యానింపుమని నా మనస్సు, నీకు ప్రణమిల్లుమని నా శిరస్సు, నీకు ప్రదక్షిణలు చేయుమని నా పాదములు, నీకు సపర్యలు చేయుమని నా శరీరము, నీ దివ్యమంగళ రూపమును వీక్షించుమని నా కన్నులు, మరియు నీ లీలా శ్రవణమును చేయుమని నా చెవులు నన్ను కోరుచున్నవి. అట్లు చేయుమని నన్ను ఆజ్ఞాపించి, వాటిని ఆచరించుటకు వలసిన ప్రేరణను నాకు ప్రసాదించుము. అంతేగాని, మాటిమాటికిని నా యెడల ఈ విధముగా మౌనమును వహింపకుము.