Monday 14 July 2014

Sivanandalahari-43

మా గచ్ఛ త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు
స్వామిన్నాదికిరాత మామకమనః కాన్తార సీమాన్తరే .
వర్తన్తే బహుశో మృగా మదజుషో మాత్సర్య మోహాదయ
స్తాన్ హత్వా మృగయా వినోద రుచితా లాభం చ సంప్రాప్స్యసి (43)

మా గచ్ఛ త్వం = నీవు వెళ్ళవద్దు
ఇతః తతః = అటు-ఇటు
గిరిశ భో = ఓ కైలాసవాసా
మయి ఏవ = నాయందే
వాసం కురు = నివాసము ఉండుము
స్వామిన్ = ఓ స్వామీ
ఆది కిరాత = ఓ ఆది కిరాతమూర్తీ (మొట్టమొదటి బోయవాడా!)
మామక మనః = నా మనస్సు (అనెడి)
కాన్తార సీమాన్తరే = అరణ్యము లోపల
వర్తన్తే = తిరుగుచున్నవి
బహుశో మృగాః = అనేక మృగములు
మదజుషః = మదించిన
మాత్సర్య మోహాదయః = మాత్సర్యము (అసూయ), మోహము మొదలగునవి
తాన్ హత్వా = వాటిని సంహరించి
మృగయా వినోద రుచితా = వేటడుట అనెడి వినోదములోగల రుచిని (మజా!)
లాభం చ సంప్రాప్స్యసి = ఆనందమును పొందగలవు

ఓ కైలాశవాసా, నీవు అటు ఇటు వెళ్ళక, కేవలము నాలోనే నివసించుము. ఓ ఆది కిరాతమూర్తి! నా మనస్సు అనెడి ఘోరారణ్యములోపల మోహము, మాత్సర్యము ఇత్యాది క్రూర మృగములు అనేకములు మదించి తిరుగుచున్నవి. వాటిని నీవు వేటాడి, వేటయందు నీకుగల కోర్కెను తీర్చుకుని ఆనందమును పొందుము!

కొన్ని వివరణలు:

ఈ శ్లోకమునందు, శ్రీ శంకరాచార్యులవారు, పరమశివుని "ఓ ఆది కిరాతమూర్తీ!" అని సందర్భోచితముగా సంభోదించారు. మనస్సులోని మోహము, మాత్సర్యము ఇత్యాది క్రూరమృగములను వేటాడుమని కోరునపుడు, ఈశ్వరునికి తనయొక్క కిరాత (బోయవాని) స్వరూపమును గుర్తుచేస్తున్నారు. అయితే ఈశ్వరుడు బోయవాని రూపమును ధరించినట్లు ఎక్కడ చెప్పబడినది?

(i) రుద్రాధ్యాయము నాలుగవ అనువాకమునందు, "నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చవో నమో" - అనగా - "మృగములను చంపే వేటగాడివైన మీకు నమస్కారము, కుక్కల మెడలయందు కట్టబడిన తాళ్ళను చేతితో పట్టుకునియున్న మీకు నమస్కారము" అని రుద్రునియొక్క కిరాత-రూపము వర్ణించబడినది.
http://namakam-telugu.blogspot.com/2012/05/anuvakam-4.html

(ii) ఆర్జునుడు పాశుపతాస్త్రమును పొందుటకై పరమేశ్వరునిగూర్చి తపస్సు చేయగా, ఈశ్వరుడు బోయవాని రూపములో వచ్చి, అర్జునుని పరీక్షించి, పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు (భారవి విరచిత కిరాతార్జునీయం).

(iii) ఈ శ్లోకములో వివరించినట్లు, ఈశ్వరుడు అనాదిగా భక్తుల హృదయములయందలి దుష్ట సంస్కారములనే క్రూర మృగములను వేటాడి సంహరించుచున్నాడు కావున, అయనను "ఆది కిరాతకమూర్తీ" అని పిలుచుకొనడము సహజమే కదా!

No comments:

Post a Comment