Tuesday 22 July 2014

Sivanandalahari-45

ఛన్దశాఖి శిఖాన్వితైః ద్విజవరైస్సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే .
చేతః పక్షిశిఖామణే త్యజ వృథా సంచారమన్యైరలం
నిత్యం శంకర పాదపద్మ యుగలీ నీడే విహారం కురు (45)

ఛన్ద శాఖి = వేదములు కొమ్మలుగాను
శిఖా అన్వితైః = (ఉపనిషత్తులు) ఆ కొమ్మల చివరలుగా కలిగినది
ద్విజవరైః = బ్రాహ్మణ శ్రేష్ఠులచే (లేదా పక్షి శ్రేష్ఠములచేతను)
సంసేవితే = విశేషముగా సేవింపబడునది
శాశ్వతే = శాశ్వతమైనది
సౌఖ్య ఆపాదిని = సౌఖ్యమును కలిగించునది
ఖేద భేదిని = దుఃఖ నాశనము చేయునది
సుధా సారైః ఫలైః = అమృతమే రసముగా కలిగిన ఫలములతో
దీపితే = ప్రకాశించుచున్నది
చేతః పక్షి శిఖా మణే = ఓ మనస్సు అనెడి పక్షి రాజమా
త్యజ వృథా సంచారం = అనవసరమైన సంచారమును విడువుము
అన్యైః అలం = ఇతరములు ఇక చాలును
నిత్యం = ఎల్లప్పుడూ
శంకర పాదపద్మ యుగలీ నీడే = శంకరుని పాదపద్మద్వంద్వము అను గూటియందు
విహారం కురు = విహరించుము

మనస్సు అనెడి ఓ పక్షిరాజమా! వృధా సంచారములను విడిచిపెట్టుము. ఆ తిరుగుళ్ళు ఇక చాలును. శంకరుని పాదపద్మములనెడి గూటియందు, వేదములు ఆ వృక్షముయొక్క కొమ్మలుగాను, ఉపనిషత్తులు కొమ్మల చివరలుగాను కలిగియుండి, బ్రాహ్మణ శ్రేష్ఠులచే విశేషముగా సేవింపబడుచున్నది, శాశ్వతమైనది, సౌఖ్యమును కలిగించునది, దుఃఖమును నశింపజేయునది, అమృతమే రసముగా కలిగిన ఫలములతో ప్రకాశించునది అగు ఆ వృక్షముపై హాయిగా విహరించుము.


కొన్ని వివరణలు:

(1) పక్షి అన్ని చోట్లకు ఎలా తిరుగుతుందో, మనస్సుకూడా అలానే అన్ని చోట్లకు తిరిగివస్తూ ఉంటుంది. అందువలన, ఈ శ్లోకమునందు మన మనస్సు బాగా తిరుగుబోతు అయిన పక్షితో పోల్చబడినది.

(2) పై శ్లోకములో "ద్విజ" అనగా "రెండు జన్మలు కలిగినది" అని అర్ధము. ఈ పదము, పక్షికిని మరియు బ్రాహ్మణునకుకూడా అన్వయమగును. పక్షి, మొదట గ్రుడ్డుగా ఉండి, ఆ తరువాత పిల్లగా దానినుండి బయటకు వచ్చును; కావున అది రెండు జన్మలు కలిగినదిగా భావింపబడును. అలానే, బ్రాహ్మణుడు (= బ్రహ్మ జ్ఞానమును పొందుటకై యత్నించువాడు) ఉపనయన సంస్కారముతో రెండవ జన్మ పొందినవాడిగా పరిగణింపబడును.

No comments:

Post a Comment