Tuesday 16 October 2012

Sivanandalahari-37

ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనస్సంఘాస్సముద్యన్మనో
మన్థానం దృఢభక్తి రజ్జు సహితం కృత్వా మథిత్వా తతః
సోమం కల్పతరుం సుపర్వ సురభిం చిన్తామణిం ధీమతాం
నిత్యానన్ద సుధాం నిరన్తరరమా సౌభాగ్యమాతన్వతే (37)

ఆమ్నాయ అంబుధిం = వేదములు అనే సముద్రమును
ఆదరేణ = ఆదరముతో
సుమనః సంఘః = సత్పురుషుల సమూహము
సముద్యన్ మనః = శ్రద్దకలిగిన మనస్సును
మన్థానం = కవ్వముగా
దృఢ భక్తి = దృఢ భక్తిని
రజ్జు సహితం = త్రాడుగా
కృత్వా = చేసుకుని
మథిత్వా తతః = మథనము చేయగా, అప్పుడు
సోమం = ఉమాసమేతుడు
కల్పతరుం = కల్పవృక్షము
సుపర్వ సురభిం = కామధేనువు
చిన్తామణిం = చింతామణి
ధీమతాం = ధీమంతులు
నిత్యానన్ద సుధాం = నిత్యానందము అనే అమృతమును
నిరన్తర రమా = నిరంతర ఐశ్వర్యమును (ముక్తి)
సౌభాగ్యం = సౌభాగ్యము
ఆతన్వతే = పొందెదరు

సత్పురుషుల సమూహము, శ్రద్దకలిగిన మనస్సును కవ్వముగా చేసుకుని, దృఢ భక్తిని త్రాడుగా చేసుకుని, వేదములు అనే సముద్రమును ఆదరముతో మథనము చేయగా, అప్పుడు ఆ ధీమంతులు, ఉమాసమేతుడగు పరమేశ్వరుడిని, కల్పవృక్షము, కామధేనువు, చింతామణులవలె కోర్కెలను ఈడేర్చువానిని, నిత్యానందము అనే అమృతమును, నిరంతర ఐశ్వర్య దాయకమైన ముక్తిని, సౌభాగ్యములను పొందెదరు.

కొన్ని వివరణలు:

(1) దేవతలు మందరగిరి పర్వతాన్ని కవ్వముగా చేసుకుని, వాసుకిని త్రాడుగా చేసుకుని పాల-సముద్రమును చిలికితే, అప్పుడు వారికి, చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, హాలాహలము, అమృతము ఇత్యాది వస్తువులు లభించాయి. అలానే, ధీమంతులు 'శ్రద్ధ కలిగిన మనస్సు'ను కవ్వముగా చేసుకుని, 'దృఢ భక్తి'ని త్రాడుగా చేసుకుని వేద-సముద్రమును చిలికితే ఏమి లభిస్తాయో ఈ శ్లోకములో శంకరాచార్యులవారు తెలియజేస్తున్నారు.

(2) శంకరాచార్యులవారు ఈ శ్లోకములో పదాలను చాలా గమ్మత్తుగా ప్రయోగించారు. ఉదాహరణకు, "సోమః" అన్న పదానికి "చంద్రుడు" అనే అర్ధముతోపాటు, "పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు" (స+ఉమః=సోమః) అని మరొక అర్ధముకూడా కలదు. పాల-సముద్రాన్ని చిలికినప్పుడు సోముడు లభిస్తే, వేద-సముద్రాన్ని చిలికినవారికి సాక్షాత్తు ఉమాసమేతుడైన పరమేశ్వరుడే లభించగలడు అని చెబుతున్నారు.

No comments:

Post a Comment