Thursday 4 October 2012

Sivanandalahari-26

కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగలం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్
సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజ గన్ధాన్ పరిమలా
నలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే (26)


కదా వా = ఎప్పుడు
త్వాం దృష్ట్వా = నిన్ను దర్శించి
గిరిశ = ఓ గిరిశ, గిరులయందు వసించువాడా
తవ భవ్యాంఘ్రి యుగలం = నీ దివ్య పాదారవిందములను
గృహీత్వా హస్తాభ్యాం = చేతులలోనికి తీసుకుని
శిరసి = శిరస్సుపైనను
నయనే = నేత్రములపైనను
వక్షసి = వక్షస్థలముపైనను
వహన్ = హత్తుకుని
సమాశ్లిష్య = వాటిని గాఢాలింగనము చేసుకుని
ఆఘ్రాయ = ఆఘ్రాణించి
స్ఫుట జలజ = అరవిరిసిన తామరపూవులవంటి
గన్ధాన్ పరిమలాన్ = సుగంధ పరిమళములను
అలభ్యాం = అలభ్యమైన
బ్రహ్మాద్యైః = బ్రహ్మాదులకు సైతం
ముదం అనుభవిష్యామి = పరమానందమును అనుభవించెదను
హృదయే = నా హృదయమునందు

ఓ గిరిశ, నేను ఎప్పుడు నిన్ను దర్శించి, నీ దివ్య పాదారవిందములను నా చేతులలోనికి తీసుకుని, వాటిని నా శిరస్సుపైనను, నేత్రములపైనను, వక్షస్థలముపైనను హత్తుకుని, వాటిని తనివితీరా గాఢాలింగనము చేసుకుని, అవి వెదజల్లెడు అరవిరిసిన తామరపూవులవంటి సుగంధ పరిమళములను తృప్తితీరా ఆఘ్రాణించి, బ్రహ్మాదులకుకూడా అలభ్యమైన పరమానందమును నా హృదయమునందు అనుభవించెదను?

కొన్ని వివరణలు:
 
(1) 24వ శ్లోకంలో శంకరాచార్యులవారు మనలను కైలాసంపైనున్న పరమేశ్వరునియొక్క సువర్ణ మణిమయ సౌధంలోనికి తీసుకువెళ్ళారు. 25వ శ్లోకంలో ఆ సౌధములో నందీశ్వరుని మూపురముపై ఆశీనుడై, బ్రహ్మాదులుచే స్తుతింపబడుచున్న ఈశ్వరునియొక్క దర్శనమును దగ్గరుండి చేయించారు. ఇక ఈ 26వ శ్లోకములో మనచేత సాక్షాత్తు శివునియొక్క పాదారవిందములకు గాఢాలింగన సహిత ప్రణామములను చేయించారు.

No comments:

Post a Comment