Friday 12 October 2012

Sivanandalahari-34

కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవ
ధ్దైర్యం చేదృశమాత్మనః స్థితిరియం చాన్యైః కథం లభ్యతే
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం
పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానన్ద సాన్ద్రో భవాన్ (34)

కిం బ్రూమః = ఏమని చెప్పగలము?
తవ సాహసం = నీ సాహసమునుగూర్చి
పశుపతే = ఓ పశుపతీ
కస్య అస్తి = ఎవరికి ఉన్నది?
శంభో = ఓ శంభో, ఆనందప్రదాయకా
భవద్ ధైర్యం = నీ ధైర్యము
చ ఈదృశం = మరియు అట్టి
ఆత్మనః స్థితిః = ఆత్మ స్థితి
ఇయం చ = ఇది మరి
అన్యైః కథం లభ్యతే = తక్కినవారు ఎలా పొందగలరు?
భ్రశ్యద్ దేవ గణం = దేవ గణములు పారిపోయినవి
త్రసన్ ముని గణం = ముని గణములు వణికిపోయినవి
నశ్యత్ ప్రపంచం లయం = ప్రపంచం నశించి లయమైపోవడం
పశ్యన్ = చూచి
నిర్భయ ఏక ఏవ = నిర్భయముగా ఒక్కడివే
విహరతి = విహరిస్తూ ఉన్నావు
ఆనన్ద సాన్ద్రః = మహదానందములో
భవాన్ = నీవు

ఓ పశుపతీ, నీ సాహసమునుగూర్చి ఏమని చెప్పగలము? ఓ శంభో, నీ ధైర్యము మరియు అట్టి ఆత్మ స్థితి మరి తక్కినవారు ఎలా పొందగలరు? ప్రపంచమంతా ప్రళయమునందు నశించి లయమైపోవడం చూచి, దేవగణములు పారిపోయినవి, మునిగణములు వణికిపోయినవి. నీవుమాత్రం నిర్భయముగా ఒక్కడివే మహదానందములో విహరిస్తూ ఉన్నావు.

కొన్ని వివరణలు:

(1) కేవలము ఈశ్వరుని గొప్పతనాన్ని స్తుతి చేయడమే ఈ శ్లోకముయొక్క లక్ష్యము కాదు. ఇంతకు ముందు శంకరాచార్యులవారు (28వ శ్లోకములో) వివరించినట్లు, మనము ఎంతగా శివుని తత్వాన్నిగూర్చి చింతన చేస్తే, మనలోనూ అంతగా ఈశ్వరుని గుణములే వికసిస్తాయి. ఈ శ్లోకములో తెలిపినట్టి ఈశ్వరుని ఆత్మ స్థితిగూర్చి ధ్యానించుటద్వారా, మనముకూడా పరిస్థితులపైన ఆధారపడని అట్టి నిశ్చలమైన, భయరహితమైన స్థితిని ఈశ్వరానుగ్రహముతో కొంతవరకైనా పొందగలమని చెప్పడం శంకరాచార్యులవారి ఆంతర్యమేమో!

No comments:

Post a Comment