Sunday 16 September 2012

Sivanandalahari-16

విరించిర్దీఘాయుర్భవతు భవతా తత్పరశిర
శ్చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ |
విచారః కో వా మాం విశద కృపయా పాతి శివ తే
కటాక్ష వ్యాపారః స్వయమపి చ దినావన పరః || (16)

విరించిః = బ్రహ్మ
దీర్ఘాయుః భవతు = దీర్ఘాయుష్మంతుడు అగుగాక
భవతా = నీచేత
తత్ పరః శిరః చతుష్కం = ఆ మిగిలిన నాలుగు శిరస్సులు
సంరక్ష్యం = సంరక్షింపబడుగాక
సః ఖలు = సాక్షాత్తు ఆయనే
భువి = ఈ భూమిమీద
దైన్యం లిఖితవాన్ = దైన్యమును అనుభవించమని (నా లలాటమున) లిఖించినవాడు
విచారః కః వా మాం = (అయినా) దీనినిగూర్చి నాకు చింత ఎందుకు?
విశద = ఓ విశదా, ప్రసన్న స్వరూపా
కృపయా పాతి = పరమకారుణ్యముతో రక్షించెడి
శివ = ఓ పరమశివా
తే కటాక్ష వ్యాపారః = నీ (ఒక్క) కృపా వీక్షణమే
స్వయం అపి = తనంత తానుగా
దీన అవన పరః = దీనులకు రక్షణనొసగగలదు

బ్రహ్మ దీర్ఘాయుష్మంతుడు అగుగాక! ఆయనయొక్క ఆ మిగిలిన నాలుగు శిరస్సులు నీచేత సంరక్షింపబడుగాక! ఈ భూమిమీద దైన్యమును అనుభవించమని నా లలాటమున లిఖించినవాడు సాక్షాత్తు ఆయనే. అయినా దీనినిగూర్చి నాకు చింత ఎందుకు? ఓ పరమశివా, ప్రసన్న స్వరూపా, నీ ఒక్క కృపా వీక్షణమే చాలు, అదే తనంత తానుగా నావంటి దీనులందరికీ రక్షణనొసగగలదు.

కొన్ని వివరణలు:

(1) బ్రహ్మదేవునిగూర్చి శంకరాచార్యులవారు సరదాగా హాస్యోక్తిగా పైవిధముగా వ్రాసారని నా అబిప్రాయము. ఎందుచేతనంటే, మన పూర్వ కర్మలతో సంబంధము లేకుండానే, ఇప్పుడు 'మనము దైన్యాన్ని అనుభవించాలి' అని బ్రహ్మ మన నుదుటన వ్రాసాసేసినాడని అనుకుందాము. అలా అనుకున్నప్పటికీ, అంతమాత్రమునకే, పరమశివుడు కోపము తెచ్చుకుని, బ్రహ్మయొక్క శిరస్సులను ఖండించవలసినంతటి ఘనకార్యములు మనమేంచేసాము గనుక?  అయితే ఈ శ్లోకము కేవలము హాస్యప్రధానమైనదే కాదన్నది సుస్పష్టము. జీవితములో దైన్య పరిస్థితులు ఎదురైనప్పటికీ, నిస్ప్రుహ పొందక, ధృఢచిత్తులై నిలబడగలగడానికి అవసరమైన దివ్యౌషధాన్ని ఈ శ్లోకంలో మనకు అందజేస్తున్నారు.

No comments:

Post a Comment